క్రైమ్‌ థ్రిల్లర్‌గా యార్‌ ఇవన్‌

5 Sep, 2017 02:02 IST|Sakshi
క్రైమ్‌ థ్రిల్లర్‌గా యార్‌ ఇవన్‌

తమిళసినిమా: క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా తెరకెక్కిన యార్‌ ఇవన్‌ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఒక పక్క వ్యాపార రంగంలో రాణిస్తూ మరో పక్క సినిమాను ఫ్యాషన్‌గా నటిస్తున్న నటుడు సచిన్‌. ఇంతకు ముందు పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా యార్‌ ఇవన్‌ పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు భాషల్లో సచిన్‌ కథానాయకుడిగా నటించి నిర్మించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఇషాగుప్తా నాయకిగా నటించింది.

ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభు, కిశోర్, సతీష్‌ తదితరులు నటించారు. ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన యార్‌ ఇవన్‌ చిత్రానికి టీ.సత్య దర్శకుడు. చిత్రం ఈ నెల 15వ తేదీన రెండు భాషల్లో విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం ఉదయం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు టీ.సత్య మాట్లాడుతూ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించిన మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం యార్‌ ఇవన్‌ అని తెలిపారు.

ఇందులో సచిన్‌ ప్రోకబడ్డీ క్రీడాకారుడిగా నటించారని తలిపారు. లవ్, యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన భారీ చిత్రంగా యార్‌ ఇవన్‌ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత, కథానాయకుడు సచిన్‌ మాట్లాడుతూ తాను వ్యాపార రంగానికి చెందిన వాడినైనా 8 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యానని చెప్పారు. అందువల్ల వ్యాపారాన్ని నాన్న చూసుకుంటారని, తనకు నటనే ముఖ్యం అని తెలిపారు. అదే విధంగా సినిమాకు భాష లేదని, యార్‌ ఇవన్‌ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు.