ఆశా భోంస్లేకు యశ్‌ చోప్రా మెమోరియల్‌ అవార్డ్‌

28 Jan, 2018 01:06 IST|Sakshi
ఆశా భోంస్లే

ప్రముఖ దర్శక–నిర్మాత యశ్‌ చోప్రా అంటే కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి ఎనలేని అభిమానం. చోప్రాతో టీయస్సార్‌కి మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన భౌతికంగా దూరమయ్యాక టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్‌ తరఫున ‘నేషనల్‌ యశ్‌ చోప్రా మెమోరియల్‌’ అవార్డ్‌ను ప్రారంభించారు. 2013లో మొదలుపెట్టి ఇప్పటివరకూ లతా మంగేష్కర్, అమితాబ్‌ బచ్చన్, రేఖ, షారుక్‌ ఖాన్‌లకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఈసారి టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్‌ జ్యూరీ సభ్యులు బోనీకపూర్, మాధుర్‌ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ముంబైలో ఈ అవార్డు వేడుక జరగనుంది. ఈ వేడుకలో అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్, షారుక్‌ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు.

మరిన్ని వార్తలు