‘కేజీఎఫ్‌’ టీంకు షాక్‌.. షూటింగ్‌ ఆపాలన్న కోర్టు

29 Aug, 2019 11:15 IST|Sakshi

కన్నడ సినీరంగంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కేజీఎఫ్‌ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

తాజాగా ఈ సినిమాకు కోర్టు షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతుందంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అతని వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయస్థానం వెంటనే సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతున్న కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ను ఆపాలని ఆదేశాలిచ్చింది.

దీంతో అర్ధాంతరంగా షూటింగ్‌ను ఆపిన చిత్రయూనిట్‌ కొత్త లొకేషన్ల కోసం వేట ప్రారంభించారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు