గర్వంగా ఉంది : ‘యాత్ర’ దర్శకుడు

9 Feb, 2019 10:37 IST|Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ్‌ సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, వైఎస్‌ఆర్‌ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.(చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ)

‘ఈ కథ, రాజశేఖర్‌ రెడ్డిగారు, ఆయన అభిమానులు, ఫాలోవర్స్‌ పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నా దృష్టిలో ఒక వ్యక్తికి ఇచ్చే అత్యుత్తమ గౌరవం కృతజ్ఞత చూపించటమే. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులు, వైఎస్‌ఆర్‌ అభిమానులకు నా నమస్కారాలు. ఇంత గొప్ప కథ చెప్పే అవకాశం కలిగించిన సినిమారంగానికి నా ధన్యవాదాలు. విమర్శలను కూడా నేను గౌరవిస్తాను.

కానీ నేను నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నా. యాత్ర లాంటి సినిమా చేయటం ఎప్పటికీ గౌరవంగానే భావిస్తా. వైఎస్‌ఆర్‌ కథ చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే ఈ సినిమా చేశా. ఇది వైఎస్‌ఆర్‌గారికి నేనిచ్చిన నివాళి. ఎంతో దాతృత్వం, వినయం, కరుణ, ధైర్యం, విశ్వసనీయత ఉన్న ఆయన్ను కేవలం మా నాయకుడు అని చెప్పటం చాలా చిన్న మాట’ అంటూ తన ఆనందాన్ని కృతజ్ఞతను అభిమానులతో పంచుకున్నారు.
 

మరిన్ని వార్తలు