‘తన కథను చెప్పమని.. ఆయనే నన్ను ఎంచుకున్నాడు’

8 Feb, 2019 19:48 IST|Sakshi

వెండితెరపై బయోపిక్‌లు అన్నివేళలా విజయాన్ని చేకూర్చలేవు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కథలో అందర్నీ ఆకర్షించగలిగే అంశాలు, మనసుల్ని కట్టిపడేసే కథనం ఉండాలి.. అంతేకానీ ఆర్భాటాలకు పోయి సినిమాను తెరకెక్కిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూశాం. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రేక్షకుల గుండెను బరువెక్కేలా, కన్నీటిని కార్చేలా చేసిన ‘యాత్ర’ సినిమా పాజిటివ్‌ టాక్‌తో సూపర్‌ హిట్‌ దిశగా దూసుకెళ్తున్న సందర్భంగా.. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్‌, నిర్మాత విజయ్‌ చిల్లా ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు..

తాను యాత్రకు సంబంధించిన రిపోర్ట్‌ను ఉదయం నాలుగు గంటలకు యూఎస్‌ నుంచి విన్నానని.. ఓ అభిమాని ఫోన్‌చేసి చాలా బాగుందని చెప్పాడని తెలిపాడు.  ఆనందో బ్రహ్మ సమయంలో.. ఈ మధ్య కాలంలో ఇలా ఓ సినిమా చూసి ఇంత సేపు నవ్వేలా చేశారని  ప్రేక్షకులు తనతో అన్నారని.. మళ్లీ ‘యాత్ర’కు వచ్చేసరికి చాలా ఏడిపించారని చెబుతున్నారని అన్నారు. చప్పట్లు కొట్టించే సన్నివేశాల కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్సే ఎక్కువగా గుర్తుంటాయని, అవే ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్తారని, హాస్పిటల్‌లో చిన్నపాప సీన్‌, రైతు సీన్‌ అందరికీ నచ్చుతుందని అన్నారు. 

ఈ చిత్రాన్ని పోస్ట్‌ప్రొడక్షన్‌లో చాలా సార్లు చూశానని.. థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే తాను నోటీస్‌ చేయని సన్నివేశాలకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను రాసిన మాటలకు కూడా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తాను వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, ఆయనే తన కథను చెప్పమని తనను ఎంచుకున్నాడేమోనని అన్నారు. ప్రతీ వ్యక్తికి వైఎస్సార్‌తో అనుబంధం ఉంటుందని.. భారతదేశంలో రాజకీయ నాయకులను నమ్మడమనేది అరుదుగా చూస్తామని.. ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడటం..చనిపోయి ఇంతకాలమైనా..ఆ వ్యక్తిని ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. ఏదో కథ ఉందని ఓ దర్శకుడిగా తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు