నేను విన్నాను.. నేనున్నాను..

21 Dec, 2018 08:39 IST|Sakshi

తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్‌ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్‌ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్‌ నేడు విడుదల చేసింది. ఓ రైతు తను పడుతున్న కష్టాలను మహానేత దృష్టికి తీసుకువచ్చే సన్నివేశాన్ని ప్రధానంగా ట్రైలర్‌లో చూపించారు. 

‘నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు.. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు.. రెండు ఉండి పంట చేతికస్తే సరైన ధర ఉండదు.. అందరు రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి’ అంటూ రైతు తన ఆవేదనను మహానేతతో పంచుకుంటారు. ట్రైలర్‌ చివర్లో మమ్ముట్టీ పలికే.. ‘నేను విన్నాను.. నేనున్నాను’ మాటలు వింటే.. ఆయన వైఎస్సార్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది. ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, గతంలో విడుదల చేసిన టీజర్‌కు, ఫస్ట్‌ లుక్‌కు తెలుగు రాష్ట్రాలోని ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు