యాత్ర టీజర్‌.. గడప కష్టాలు వినేందుకు రాజన్న...

8 Jul, 2018 08:21 IST|Sakshi
టీజర్‌లోని దృశ్యాల ఆధారంగా చిత్రం...

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది.  మళయాళ మెగాస్టార్‌ మమ్ముటీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. టీజర్‌ విషయానికొస్తే...

పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్‌ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్‌ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో... చరిత్రే నిర్ణయించుకోని’ అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో డైలాగులు వినిపించాయి. పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్‌గా మమ్ముట్టి.. లుక్‌ ఆకర్షించింది. ‘కే’ అందించిన బ్యాక్‌ గ్రౌడ్‌ స్కోర్‌ గూస్‌బమ్స్‌ తెప్పించేదిలా ఉంది. 

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అతిత్వరలో యాత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ కృషి చేస్తోంది. 

మరిన్ని వార్తలు