‘యాత్ర’ విడుదల తేదీ ఖరారు

12 Sep, 2018 20:06 IST|Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం విడుదల తేదీని యూనిట్‌ సభ్యులు ఖరారు చేశారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా  బుధవారం విడుదల చేసింది. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా  ఈ చిత్రాన్ని ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. 

శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు కొన్ని రోజుల ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.

మరిన్ని వార్తలు