ఓ పక్క అభినందనలు.. మరోపక్క ఈ వార్త నిజమేనా సౌందర్యా? అంటూ ఆరాలు.. శుక్రవారం రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్ భిన్నమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్గా ఆమె నియమితులయ్యారు. అదే రోజున ఆమె విడాకులు తీసుకోనున్నారనే అంశం ప్రముఖంగా వినిపించింది. వ్యాపారవేత్త అశ్వినీ రామ్కుమార్, సౌందర్యా రజనీకాంత్లు 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
2015లో వీరికో బాబు పుట్టాడు. వీరిద్దరూ విడిపోతున్నారనే వార్త శుక్రవారం హైలైట్ అయ్యింది. అభినందనలు తెలిపిన వారికి థ్యాంక్స్ చెబుతూనే, విడాకుల వార్తపై సౌందర్యా రజనీకాంత్ స్పందించారు. ‘‘నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమే. ఏడాదిగా మేమిద్దరం విడిగా ఉంటున్నాం. విడాకుల గురించి చర్చలు జరుగుతున్నాయి. మా ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించాలని అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అని ఆమె ట్వీట్ చేశారు.