మహేశ్ కోసం పాడే అవకాశం రాలేదు: నమ్రత

23 Jul, 2015 10:57 IST|Sakshi
మహేశ్ కోసం పాడే అవకాశం రాలేదు: నమ్రత

హైదరాబాద్: తాను పిల్లల కోసం పాటలు పాడుతుంటానని, కానీ, తన భర్త ప్రముఖ నటుడు మహేశ్ బాబు కోసం పాట పాడే అవకాశం మాత్రం ఇంకా రాలేదని నటి, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ అన్నారు. మహేశ్ను పరిణయమాడిన తర్వాత వ్యక్తిగత కుటుంబ జీవితానికే పరిమితమైన ఆమె త్వరలో విడుదల కానున్న శ్రీమంతుడు చిత్రానికి సంబంధించి కొన్ని అనుభూతులు పంచుకున్నారు. శ్రీమంతుడు చిత్రం ద్వారా మహేశ్ దంపతులు కో-ప్రొడ్యూసర్గా మారిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రశ్నించగా బాలీవుడ్లో చాలామంది హీరోలకు స్వంత ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయని, అలాగే, తమ బడ్జెట్ తగినట్లుగా కో-ప్రొడ్యూసర్గా మారడం వల్ల అసలైన ప్రొడ్యూసర్స్కు కొంత భారం తగ్గినట్లవుతుందని చెప్పారు. అమలలాగా రెండో ఇన్నింగ్స్ మొదలు పెడతారా అని ప్రశ్నించగా, అమల పిల్లలు పెద్దవారయ్యారని, తన పిల్లలు ఇంకా చిన్న పిల్లలే అయినందున ఇంకా అలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. అయినా, మహేశ్తో ఇలాంటి జీవితం చాలా బాగుందని, లోటనే విషయమే గుర్తురావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు.

పిల్లల గురించి మాట్లాడుతూ 'మా కుమారుడు గౌతమ్ కోసం మహేశ్ చిత్రంలోని పాటలు పాడి వినిపిస్తానని, అలాగే కూతురు సితార కోసం ప్రాజెన్ చిత్రంలోని 'లెట్ ఇట్ గో' అనే పాట పాడి వినిపిస్తానని తెలిపారు. ఇక వ్యక్తిగతంగా తనకు ప్రస్తుతం శ్రీమంతుడు చిత్రంలోని రామా రామా అనే పాట ఇష్టమని తెలిపారు. మీ వారి కోసం పాటపాడలేదా అని ప్రశ్నించగా ఒక్కసారిగా నవ్వులు పూయిస్తూ.. మహేశ్కోసం పాడే అవకాశం ఇంకా రాలేదంటూ మురిసిపోయారు.
 

>