దమ్మున్న కుర్రోడి కథ

19 May, 2019 05:36 IST|Sakshi
విక్రమ్‌ సహిదేవ్

‘‘పోయిన చోటే వెతుక్కోవాలి’ అని తెలుగులో ఒక నానుడి. ఓ కుర్రాడు మార్కెట్‌లో పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్‌లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది ఈ నెల 24న తెరపై చూసి తెలుసుకోవాలి’’ అని దర్శకుడు రఘు జయ అంటున్నారు. విక్రమ్‌ సహిదేవ్, ప్రియాంకా జైన్‌ జంటగా రఘు జయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్‌ బ్రేవ్‌ హార్ట్‌’ అన్నది ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీధర్‌ నిర్మించారు.

ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. రఘు జయ చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో విక్రమ్‌ సహిదేవ్‌ యాక్టింగ్, డైలాగ్‌ డెలివరీ బావుందని అందరూ ప్రశంసించడం సంతోషంగా ఉంది. ట్రైలర్‌ విడుదల చేసిన సుకుమార్‌గారు కూడా మెచ్చుకున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర.

మరిన్ని వార్తలు