యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్‌

15 May, 2020 18:04 IST|Sakshi

చెన్నై : యువ దర్శకుడు అరుణ్‌ ప్రసాత్‌ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న అరుణ్‌ను.. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని మెట్టుపాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అరుణ్‌.. జీవీ ప్రకాష్‌ కుమార్‌, గాయత్రి సురేష్‌, సురేష్‌ మీనన్‌, సతీష్‌ ముఖ్య పాత్రల్లో 4 జీ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే సీవీ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం పలు కారణాలతో ఇప్పటివరకు విడుదల కాలేదు. 

అరుణ్‌ ఆకస్మిక మరణం కోలివుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అరుణ్‌ మృతిపై దర్శకుడు శంకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. యువదర్శకుడు, తన మాజీ అసిస్టెంట్‌ అరుణ్‌ ఆకస్మిక మరణం.. తనను కలిచివేసిందని చెప్పారు. అరుణ్‌ మృదు స్వభావి అని, పాజిటివ్‌ థింకింగ్‌తో కష్టపడుతూ ముందుకు సాగేవాడని గుర్తుచేసుకున్నారు. అరుణ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హీరో జీవీ ప్రకాష్‌, హాస్యనటుడు మనోబాలా కూడా అరుణ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు. (చదవండి : అనసూయను అభినందించిన రాచకొండ పోలీసులు)

మరిన్ని వార్తలు