-

సాహో స్టార్ట్‌

11 Jun, 2017 00:11 IST|Sakshi
సాహో స్టార్ట్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు నేషనల్‌ లెవెల్‌ స్టార్‌. ‘బాహుబలి’ సూపర్‌ సక్సెస్‌తో ఆయన రేంజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరి అలాంటి స్టార్, అంత పెద్ద సక్సెస్‌ తర్వాత చేసే సినిమా అంటే ఎలా ఉండాలి? ‘సాహో’ టీమ్‌ దీన్ని దృష్టిలో పెట్టుకుంది. అందుకే సుమారు 150కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేస్తోంది.

ఏప్రిల్‌ నెలలో కేవలం టీజర్‌ కోసమే ఒక్క రోజు షూట్‌ జరిపినా, పూర్తి స్థాయిలో మాత్రం ‘సాహో’ నిన్ననే సెట్స్‌ పైకెళ్ళింది. ‘రన్‌ రాజా రన్‌’తో పరిచయమైన సుజీత్‌ ఈ సినిమాకు దర్శకుడు కాగా, యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ. ‘బాహుబలి–2’ రిలీజ్‌ తర్వాత హాలిడేకు వెళ్ళిన ప్రభాస్‌ హైదరాబాద్‌ వచ్చేశారు. అయినా ప్రస్తుతానికి ప్రభాస్‌ లేకుండానే విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పాల్గొంటుండగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీల్‌ నితిన్‌ చేస్తోన్న మొదటి తెలుగు సినిమా ‘సాహో’నే!

‘జై లవకుశ’లో నితిన్‌ లేడు!
‘సాహో’ షూటింగ్‌లో పాల్గొనేందుకు నిన్ననే నీల్‌ నితిన్‌ ముఖేష్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఇదే విషయాన్ని నితిన్‌ తన ట్విట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా తెలియజేశారు. ఇక ‘సాహో’తో పాటు ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తోన్న ‘జై లవకుశ’లోనూ నీల్‌ నితిన్‌ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆయన తమ సినిమాలో నటించడం లేదని ‘జై లవకుశ’ టీమ్‌ స్పష్టం చేసింది.