‘ఇదం జగత్‌’ టీజర్‌ విడుదల చేసిన వైఎస్‌ జగన్‌

21 Aug, 2018 18:58 IST|Sakshi

సుమంత్, అంజు కురియన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఇదం జగత్‌’ సినిమా టీజర్‌ను ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌.. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్‌.రాయవరం మండలం దార్లపూడిలో సాయంత్రం బస చేసిన శిబిరంలో హీరో సుమంత్‌ సమక్షంలో టీజర్‌ను విడుదల చేశారు. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ శ్రీకంఠం దర్శకుడు. 

టీజర్‌లో.. ‘ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహం న్యూసే.. చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే అది ఎన్‌క్యాష్‌ చేసుకోవడం తెలుసుకోండి. అవసరమైతే ఆ న్యూస్‌ క్రియేట్‌ చేయడం కూడా తెలిసుండాలి అది నాకు తెలుసు’ అనే సుమంత్‌ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ డైలాగ్స్‌తో సుమంత్‌ కెమెరామన్‌ పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్‌గా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను  జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు