-

యాత్ర తొలి టికెట్‌ @ రూ.4.37లక్షలు

5 Feb, 2019 03:31 IST|Sakshi
మమ్ముట్టి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో మహి వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు (దాదాపు 4.37 లక్షలు) సొంతం చేసుకుని వైఎస్‌పై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ నెలకొంది.

70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా వైఎస్‌గారి అభిమాని మునీశ్వర్‌ రెడ్డి భారీ మొత్తాన్ని చెల్లించి మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డబ్బులో టికెట్‌కి సరిపడా 12 డాలర్లు (దాదాపు 860) మాత్రమే తీసుకుని, మిగతా డబ్బుని వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. రాజన్న క్యాంటీన్స్, వాటర్‌ ప్లాంట్స్‌ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. వైఎస్‌గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు