నిర్మాతగా యువన్ శంకర్‌రాజా

19 Jun, 2016 03:22 IST|Sakshi
నిర్మాతగా యువన్ శంకర్‌రాజా

ధనార్జన, లాభనష్టాలను పక్కన పెడితే సినిమా ఒక ఫ్యాషన్. ఎవరికైనా ఇది కాదనలేని నిజం. అలాగే ఇల్లు కట్టి చూడు,పెళ్లి చేసి చూడు అన్న సామెతలానే సినిమా నిర్మించి చూడు అని కూడా అంటారు. ఇదీ అంత కష్టమైన కార్యమే. ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఇతర రంగాల్లో రాణించేవారు కూడా చిత్ర నిర్మాణంపై ఆసక్తి చూపడం అన్నది మొదటి నుంచి జరుగుతున్నదే.అలా ఏసీ థియేటర్లలో కూర్చుని రాగాలు దీసే, బాణీలు కట్టే సంగీత దర్శకులు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం గమనార్హం.

ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా కూడా కమలహాసన్ హీరోగా సింగారవేలన్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ తరం సంగీత దర్శకుల్లో విజయ్‌ఆంటోని నిర్మాతగానే కాకుండా కథానాయకుడిగానూ రాణిస్తున్నారు.ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ 99 పాటలు పేరుతో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా యువన్ శంకర్‌రాజా నిర్మాతగా అవతారమెత్తనున్నారు.

ఇటీవలే తండ్రి అయిన యువన్ చిత్రాలతో పాటు విదేశాల్లో సంగీత విభావరిలతో బిజీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నిర్మాతగా ఒక భారీ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నిర్మించనున్న తొలి చిత్రంలో క్రేజీ జంట జయంరవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తనీఒరువన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత ఈ జంట నటించనున్న చిత్రం ఇదే అవుతుంది. మరో విషయం ఏమిటంటే ఇది చారిత్రక కథా చిత్రంగా ఉంటుందట.

దీనికి నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సంచలన చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాతగా ఇళయరాజా చేతులు కాల్చుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. మరి ఆయన వారసుడు యువన్ శంకర్‌రాజా దాన్ని బ్రేక్ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

>