దెబ్బ కొడితే దవడ పగులుద్ది: హీరోయిన్‌

20 Feb, 2018 17:23 IST|Sakshi
ఎంటీవీ యాంకర్‌ రణవిజయ్‌ సింఘా సమక్షంలో యువకుడికి జరీన్‌ఖాన్‌ వార్నింగ్‌ (ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో)

సాక్షి, ముంబై: ‘నువ్వు కచ్చితంగా నీ తల్లిదండ్రులను గౌరవించవు. నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నీ గురించి ఏమనుకుంటున్నావ్‌? నువ్వు ఎవరికి తెలుసు? ఇప్పుడే ఇక్కడే చెంపదెబ్బ కొట్టమంటావా? నా చెయ్యి చూశావా? ఇది నీ ముఖం కంటే పెద్దదిగా ఉంది. ఈ చేతితో దెబ్బ కొడితే నీ దవడ పగలడం ఖాయమ’ని బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీన్‌ ఖాన్ టీవీ కార్యాక్రమంలో గట్టి హెచ్చరిక చేసింది.

సోషల్‌ మీడియాలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 23 ఏళ్ల యువకుడికి ఎంటీవీ ‘ట్ర్రోల్‌ పోలీస్‌’ షోలో వార్నింగ్‌ ఇచ్చింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి బ్రెయిన్‌వాష్‌ చేస్తున్నారు. ‘ట్ర్రోల్‌ పోలీస్‌’లో తాప్సి ఎపిసోడ్‌ చూసిన తర్వాత ఎంటీవీని సంప్రదించి తాను ఈ షోలో పాల్గొనట్టు జరీన్‌ ఖాన్ వెల్లడించింది. సోషల్‌ మీడియాలో అకారణంగా తమపై దూషణలకు దిగేవారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపింది.

సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేసే వారు దాక్కోలేరని, ఎక్కడున్నా దొరికిపోతారని ‘హేట్‌ స్టోరీ 3’  హీరోయిన్‌ హెచ్చరించింది. అనవసర విషయాల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఇకనైనా బుద్ధిగా ఉండాలని సలహాయిచ్చింది. జరీన్‌ ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు