భువనగిరిలో కార్డన్‌ సెర్చ్‌

14 Jan, 2018 08:56 IST|Sakshi

పట్టణంలోని 2,3 వార్డుల్లోని ఇళ్లలో విస్తృత తనిఖీలు

అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్ల గుర్తింపు

మద్యం, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం,వాహనాలు సీజ్‌

ప్రశాంత వాతావరణం కోసమే కార్డన్‌ సెర్చ్‌ : డీసీపీ రామచంద్రారెడ్డి  

భువనగిరిఅర్బన్‌ : నేరాల నియంత్రణలో భాగంగా రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ఆదేశాల మేరకు డీసీసీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మూకుమ్మడిగా కార్డన్‌ సెర్చ్‌కు దిగారు. సుమారు 250 మంది పోలీసులు 2,3 వార్డుల్లోని ఇళ్లలో విస్తృ తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భం గా డీసీపీ మాట్లాడుతూ..  భువనగిరి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం కోసం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్తులు, పలు కేసుల్లో నిందితులుగా ఉండి పరారీ లో ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితులను వదిలిపెట్టేది లేదన్నారు.

ఈ తనిఖీ ల్లో ఎనిమిది మంది అనుమానితులను, ఇద్దరు రౌడీషీటర్లను గుర్తించినట్లు డీసీపీ చెప్పారు. అలాగే అనుమతి లేకుండా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న, ఎక్కువగా గ్యాస్‌ సిలిండర్లు కలిగిన ఉన్న, ఇంట్లో మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించామని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.2, 3వ వార్డులోని సంతోష్‌నగర్, సంజీ వనగర్‌ కాలనీల్లో  పూర్తి స్థాయిలో తనిఖీలు చేపటట్టామని అనుమతి, సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రెండు ట్రాక్టర్లు, రెండు ప్యాసింజర్‌ ఆటోలు, ఒక కారు, 43 బైకులను సీజ్‌ చేసినట్లు చెప్పారు. ఆధారాలు చూపితే వాహనాలు ఇస్తామన్నారు. పోలీసులకు రెండు కాలనీల ప్రజలు సహకరించాలని తెలిపారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇక ముందు అన్ని కాలనీల్లో కార్డెన్‌ సెర్చ్‌లు కొనసాగుతాయని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ రమేష్, 7 మంది సీఐలు ఎం. శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, అంజనేయులు, 20 మంది ఎస్‌ఐలు, 250 మంది కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు