చిట్యాల (నకిరేకల్) : నల్లగొండ జిల్లాలోని చిట్యాల పట్టణ శివారులోని కేఎంసీఎల్ పరిశ్రమ సమీపంలో కొంతమంది కార్మికులకు మంగళవారం ఉదయం ఓ పిల్లి కంట బడింది. ఆ పిల్లి సాధారణంగా ఊరిలో తిరిగి పిల్లుల కంటే కాస్త బిన్నంగా ఉంది. ముక్కుపై పెద్ద పెద్ద మీసాలతో, కాళ్ళకు పెద్ద గోళ్లతో చూసేందుకు చిరుతపులి పిల్ల మాదిరిగా ఉంది. దీంతో ఆ కార్మికులు ఆ పిల్లిని..చిరుతపులి పిల్లనుకుని బంధించారు.
చిరుతపులి ఇక్కడ తిరుగుతుందని, దాని పిల్ల తప్పిపోయి దొరికిందని ప్రచారం జరగటంతో స్థానికులు అక్కడికి పెద్దఎత్తున తరలి వెళ్ళి చూడసాగారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సైదాబాబు ఘటనస్థలికి చేరుకుని విచారణ చేశారు. ఆటవీ శాఖ అధికారులు సైతం చేరుకుని కార్మికులు బంధించింది చిరుతపులి పిల్ల కాదని జంగం పిల్లి అని తేల్చేశారు. దీంతో అందరిలో అలజడి, భయం తగ్గింది.