కశ్మీర్‌లో ఉగ్రదాడి

21 Feb, 2016 00:50 IST|Sakshi
కశ్మీర్‌లో ఉగ్రదాడి

♦ ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఒక పౌరుడి మృతి
♦ శ్రీనగర్ సమీపంలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
♦ ప్రభుత్వ భవనంలోకి చొరబాటు
♦ కొనసాగుతున్న కాల్పులు
 
 శ్రీనగర్: పఠాన్‌కోట్ దాడిని మరవక ముందే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం శ్రీనగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలోని పాంపోర్‌లో శ్రీనగర్-జమ్మూ హైవేలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లను, ఒక పౌరుణ్ని బలితీసుకున్నారు. దాడిలో మరో 9 మంది గాయపడ్డారు. కాల్పుల తర్వాత మిలిటెంట్లు పక్కనే ఉన్న ప్రభుత్వ భవనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఈడీఐ)లోకి చొరబడ్డారు. స్థానిక పోలీసులు, సీఆర్‌పీఫ్ జవాన్లు భవనంలోని వందమందికిపైగా ఉద్యోగులు, ట్రైనీలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

లోపల మాటేసిన మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు నడుమ ఆగి ఆగి కాల్పులు జరుగుతున్నాయి. 10 కి.మీ దూరంలోని 15వ కాప్స్ స్థావరం నుంచి జవాన్లు హుటాహుటిన చేరుకున్నారు. ముష్కరులు తప్పించుకోకుండా భవనాన్ని చుట్టుముట్టి, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. మిలింటెంట్లు తమకేమీ హాని చేయబోమని, భవనం నుంచి వెళ్లిపోవాలని తమకు చెప్పినట్లు భద్రతా బలగాలు రక్షించిన ఒక పౌరుడు తెలిపాడు. ముగ్గురి నుంచి ఐదుగురు మిలిటెంట్లను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటికి తరలించామని డీజీపీ కె.రాజేంద్ర తెలిపారు. దక్షిణ కశ్మీర్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు ఈడీఐ వెలుపల కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. తొలుత ఇద్దరు జ వాన్లు చనిపోగా, తీవ్రంగా గాయపడిన అబ్దుల్ గనీ మీర్ అనే పౌరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈడీఐ భవనం వద్ద సెక్యూరిటీ బ్యారికేడ్లను దాటేందు ప్రయత్నించిన ఇద్దరు చొరబాటు దారులను ఆర్మీ హతమార్చింది.

మరిన్ని వార్తలు