11వేల వైఫై హాట్‌స్పాట్స్‌: 4వేల బస్టాప్‌ల్లో కూడా!

4 Dec, 2019 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో త్వరలో పెద్ద ఎత్తున బహిరంగ వైఫై హాట్‌స్పాట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ నగరమంతటా 11వేల వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ప్రకటించారు. ఇందులో నాలుగువేల వైఫై హాట్‌స్పాట్లు బస్టాప్‌ల్లో ఏర్పాటుచేయనుండగా, మరో ఏడువేలు మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని, దీంతో నగరమంతటా ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కేజ్రీవాల్‌ వివరించారు.

ఈ పథకంలో మొదటి 100 వైఫై హాట్‌స్పాట్లను ఈ నెల 16న ప్రారంభించబోతున్నామని, ఈ పథకం కోసం రూ. 100 కోట్ల ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. దశలవారీగా 500చొప్పున వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటుచేసుకుంటూపోతామని, మొత్తం ఆరు నెలల్లో 11వేల హాట్‌స్పాట్లు ఏర్పాటుకానున్నాయని చెప్పారు. ఈ వైఫై హాట్‌స్పాట్ల ద్వారా ప్రతి వ్యక్తి నెలకు 15జీబీల ఇంటర్‌నెట్‌ డాటాను ఉపయోగించుకోవచ్చు. 2015 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ చెప్పారు. పబిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంలో 11వేల వైఫై హాట్‌స్పాట్ల ఏర్పాటు ప్రతిపాదనను గత ఆగస్టులో ఢిల్లీ సర్కారు ఆమోదించింది. ఈ పథకం కింద సర్కారు ప్రతి ఏడాది రూ. 100 కోట్లు ఖర్చు చేయనుంది.

>
మరిన్ని వార్తలు