13మందిని బలితీసుకున్న డాక్టర్ల సమ్మె

17 Nov, 2017 16:49 IST|Sakshi

సాక్షి, పట్నా: రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారని నిరసనగా చేపట్టిన డాక్టర్ల సమ్మె 13 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విచారకర ఘటన బీహార్‌లోని పట్నా మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వైద్యం కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచారు. ఓ​రోగి మృతిని తట్టుకోలేని అతని బంధువులు జూనియర్‌ డాక్టర్లపై దాడి చేశారు. రెండు నెలల వ్యవధిలో మూడో ఘటన కావడంతో సుమారు 500 మంది జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో అత్యవసర చికిత్సలు నిలిచిపోయాయి.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుమారు 13 మంది ప్రాణాలు వదిలారని, చేసేదేమి లేక రోగులను ఇతర ప్రయివేట్‌ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. సీనియర్‌ డాక్టర్లతో ఎమర్జన్సీ వార్డులో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో రోగులు ఉండటంతో ఏమి చేయలేకపోయామన్నారు.  దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక 13 మంది మృతి చెందటంతో బీహార్‌ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్‌ పాండే జూడాలను చర్చలకు ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు