నిఘా వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి 2017లో జరిగిన సీమాంతర కాల్పులు, వ్యూహాత్మక ఘటనల్లో 138 మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుబెట్టిందని ప్రభుత్వ నిఘా వర్గాలు వెల్లడించాయి. 28 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. 2017లో 860.. 2016లో 221 కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయ న్న నిఘా వర్గాలు.. 2017 డిసెంబర్ 25న ఎల్ఓసీ దాటి వెళ్లి ముగ్గురు పాక్ సైనికులను మట్టుబెట్టిన ఘటననూ అందులో పేర్కొన్నాయి.
సాధారణంగా పాక్ సైనికుల మరణాలను అక్కడి ఆర్మీ ధ్రువీకరించదని, కొన్ని సందర్భాల్లో సైనికుల మరణాలను పౌరుల మరణాలుగా చూపిస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలను భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ చెప్పారు.