రాజస్తాన్‌లో కూలిన పందిరి

24 Jun, 2019 04:44 IST|Sakshi
పందిరి కుప్పకూలిన ప్రాంతం వద్ద గుమికూడిన జనం

14 మంది మృతి, 50 మందికి గాయాలు

విచారణకు ఆదేశించిన సీఎం అశోక్‌ గహ్లోత్‌

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

ప్రధాని మోదీ, హోంమంత్రి షా, రాహుల్‌ దిగ్భ్రాంతి

బెర్మర్‌/జైపూర్‌: రాజస్తాన్‌లోని బెర్మర్‌ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్‌ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది ప్రజలు అక్కడే కూర్చుని రామకథను చూస్తుండగా బలమైన గాలులకు పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయమై ఏఎస్పీ రతన్‌లాల్‌ భార్గవ మాట్లాడుతూ.. ‘రామ కథ ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి.

దీంతో పందిరి ఓవైపు నుంచి కూలిపోవడం ఆరంభమైంది. ఈ నాటకానికి నేతృత్వం వహిస్తున్న మురళీధర్‌ మహరాజ్‌ దీన్ని గమనించి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడినుంచి బయటపడేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఈ పందిరి భక్తులపై కుప్పకూలిపోయింది’ అని తెలిపారు. ఇనుపరాడ్లు–టెంట్ల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన తమకు విద్యుత్‌ షాక్‌ తగిలిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. 14 మంది చనిపోవడానికి గల కారణం పోస్ట్‌మార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు.  

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజస్తాన్‌లోని బర్మర్‌లో పందిరి కూలిపోవడం నిజంగా దురదృష్టకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. మరోవైపు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఈ ప్రమాద విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల వరకూ నష్టపరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు.

ఈ ప్రమాదంపై జోధ్‌పూర్‌ డివిజినల్‌ కమిషనర్‌ బీఎల్‌ కోఠారి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.అనంతరం ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరిన్ని వార్తలు