‘హిమాచల్‌’ మృతులు14

16 Jul, 2019 04:31 IST|Sakshi
శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనని వెతుకుతున్న సిబ్బంది

అందులో 13 మంది సైనికులే

28 మందికి గాయాలు

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య సోమవారానికి 14కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 28కి చేరింది. మరణించిన వారిలో 13 మంది సైనికులు ఉన్నారు. వారితో పాటు మృతి చెందిన ఓ పౌరుడి మృతదేహాన్ని శిధిలాల నుంచి వెలికితీశారు. గాయపడిన 28 మందిలో 17 మంది ఆర్మీ సైనికులు కాగా మరో 11 మంది సాధారణ పౌరులు ఉన్నారు. వీరంతా నాలుగు అంతస్తుల రెస్టారెంట్‌లో ఉండగా ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భవనం కూలిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు సహాయక చర్యలు కొనసాగాయని జిల్లా అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు శివ్‌ కుమార్‌ తెలిపారు.

భవనాన్ని నిబంధనలకు లోబడి నిర్మించకపోవడం వల్లే కూలిపోయిందని పోలీసులు గుర్తించారు. భవన యజమానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతోపాటు విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక పరిశీలించాక తగు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆదివారం నుంచే హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ రోహిత్‌ రాథోర్‌ను ఈ ఘటన వివరాలు సేకరించేందుకు నియమించామని డిప్యూటీ కమిషనర్‌ కేసీ చమాన్‌ అన్నారు. మొదట అది భూకంపం అనుకున్నామని గాయపడిన ఓ సైనికుడు చెప్పారు.

మరిన్ని వార్తలు