టాప్‌ 20 : ఆ 14 నగరాలు భారత్‌లోనే..

2 May, 2018 09:04 IST|Sakshi
ఢిల్లీలో గాలి కాలుష్యం (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో కేవలం భారత్‌లోనే 14 ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ అపఖ్యాతిని మూటగట్టుకుంది. రెండోస్థానంలో కైరో, మూడో స్థానంలో ఢాకా ఉన్నాయి. భారత్‌లో అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో వారణాసి, కాన్పూర్‌, ఫరీదాబాద్‌, గయా, పాట్నా, ఆగ్రా, ముజఫరాపూర్‌, శ్రీనగర్‌, గురుగ్రామ్‌, జైపూర్‌, పటియాలా, జోధ్‌పూర్‌లు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

2016లో కాలుష్య లెవల్స్‌ ఆధారంగా వీటిని ప్రకటించినట్లు తెలిపింది. భారత్‌లోని నగరాలతో పాటు కువైట్‌లోని అలీ సుబాహ్‌ అల్‌ సలేం, మంగోలియా, చైనాలోని కొన్ని నగరాలు డబ్ల్యూహెచ్‌వో టాప్‌ 20 లిస్టులో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది కాలుష్యపూరిత గాలిని శ్వాసిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వివరించింది.

గాలిలో సల్ఫేట్‌, నైట్రేట్‌, బ్లాక్‌ కార్బన్‌ కారకాలు ఉండటం మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పింది. దాదాపు 70 లక్షల మరణాలు ఏటా గాలి కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయని వెల్లడించింది. వీటిలో 24 శాతం మంది గుండె జబ్బులతో, 25 శాతం గుండె పోటుతో, 43 శాతం మంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో, 29 శాతం మంది ఊపరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారని వివరించింది.

మరిన్ని వార్తలు