‘ఆ హత్య ప్రత్యక్షంగా చూసి భయంతో పరుగెత్తాను’

13 Jul, 2016 09:58 IST|Sakshi
‘ఆ హత్య ప్రత్యక్షంగా చూసి భయంతో పరుగెత్తాను’

ముంబయి: కమ్యూనిస్టు ప్రముఖ నేత గోవింద్ పన్సారేను గుర్తు తెలియని దుండగులు ఎలా కాల్చి చంపారనే విషయాన్ని ఓ పద్నాలుగేళ్ల బాలుడు వివరించాడు. గత ఏడాది ఫిబ్రవరి 16న కోలాపూర్ లో మార్నింగ్ వాక్ కు తన భార్యతో కలిసి బయటకు వెళ్లిన గోవింద్ పన్సారే దంపతులపై ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు సాయుధ దుండగులు కాల్పులు జరిపి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఈ పద్నాలుగేళ్ల బాలుడే ప్రత్యక్ష సాక్షి. అతడు పోలీసులకు ఏం చెప్పాడంటే..

’ఒక్కసారిగా టపాసుల చప్పుడులాగా గట్టిగా వినిపించింది. ఆ సమయంలో స్కూల్ కి వెళ్తున్న నేను ఆ శబ్దం వైపు చూశాను. ఓ బైక్ పై ఉన్న వ్యక్తి ఓ పెద్దావిడపై కాల్పులు జరిపాడు. ఆమె పడిపోయింది. దాంతో అక్కడి నుంచి యూ టర్న్ తీసుకొని వేగంగా కదిలాడు. ఆ సమయంలో ఓ సైకిలిస్టును ఢీకొట్టాడు. ఆ వెంటనే తనవైపుగా వస్తున్న అజోబా(మరాఠీలో తాతయ్యను అజోబా అంటారు)పై మరో యువకుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కూడా కుప్పకూలిపోయారు. నేనప్పుడు ఆ తాతయ్య వద్దకు పరుగెట్టే ప్రయత్నం చేయగా నన్నొక పెద్దమనిషి పట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు పారిపో.. పరుగెత్తు పరుగెత్తు అన్నారు. అప్పుడు నేను భయంతో స్కూల్కి పరుగెత్తాను. తొలుత మా టీచర్ కు ఆ తర్వాత ఇంటికి వెళ్లి అమ్మానాన్నకు చెప్పాను’అని వివరించాడు. ప్రశ్న, సమాధానం పద్ధతిలో మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు ఈ బాలుడికి పోలీసులు వేశారు.

మరిన్ని వార్తలు