సాక్షి, ఢిల్లీ : కరోనా కట్టడికి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం మరో చర్యకు ఉపక్రమించింది. దీనికోసం రెడ్జోన్లు, హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లుగా విభజించిన 13,750 ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు, నిత్యవసరాల సరఫరాకు 14 వేలమంది ఫుడ్ సప్లయర్లను రంగంలోకి దింపుతోంది. వీరు కరోనా అనుమానిత వ్యక్తులను ఓ కంట కనిపెడుతుంటారు. ఎవరిపై అయినా అనుమానం వస్తే వెంటనే సమచారాన్ని హెల్త్ టీమ్స్కి అందిస్తారు. ఈ వారియర్స్ని కంటైన్మెంట్ అండ్ సర్వేలెన్స్ టీమ్ గా పిలుస్తారు. ఒక్కో బృందంలో ఐదుగరు సభ్యులు ఉంటారు. వీరిని పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. ఆ బూత్ లెవెల్ ఏరియాలో వీళ్లు పెట్రోలింగ్ చేస్తారు. స్థానికుల్ని కలుస్తారు. ఒక్కో టీమ్ 500 ఇళ్లలో వారిని కలుస్తుంది.
ప్రతీ టీంలో ఓ కానిస్టేబుల్, శానిటేషన్ వర్కర్, సివిల్ డిఫెన్స్ వాలంటీర్, ఆశా హెల్త్ వర్కర్ లేదా అంగన్ వాడీ వర్కర్ ఉంటారు. వీళ్లలో చాలా మంది స్థానికులే ఉంటారు. మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. దేశంలోనే ఇలా గ్రౌండ్ లెవెల్లో కరోనా కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది తామేనని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. దేశంలో మహారాష్ట్ర (2334 కేసులు) తర్వాత ఢిల్లీలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజా బులిటెన్ ప్రకారం... ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1510కి చేరుకోగా, వారిలో 30 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు. 28 మంది చనిపోయారు.