అర్థరాత్రి అలజడి: కేంద్రం గుప్పిట్లోకి కశ్మీర్‌

5 Aug, 2019 07:30 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు

నిర్బంధంలో మాజీ సీఎంలు ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా

మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అక్కడి పరిస్థితినంతా కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడమ సోమవారం ఉదయం 9:30 గంటలకు జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కశ్మీర్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో కేబినెట్‌ భేటీని ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఆర్టికల్‌ 35ఏ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు లోయకు మరింత అదనపు బలగాలను తరలించారు.

ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఓ ట్వీట్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది’ అని మెహబూబా ట్వీట్‌ చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్‌ నేత ఉస్మాన్‌ మాజిద్‌, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పేర్కొన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్‌ ఐజీలతో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

జమ్మూ, కశ్మీర్ ప్రజలపై దాడిచేయడమే
కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్‌మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ విషయమై ఫరూక్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్‌ 35 ఏ, ఆర్టికల్‌ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దు చేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్‌ ప్రజలపై దాడిచేయడమే.’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు