ట్రాన్స్‌జెండర్ల సామూహిక వివాహాలు..

31 Mar, 2019 13:25 IST|Sakshi

రాయ్‌పూర్‌: తమకు ఓ మనసు ఉంటుందని అంటున్నారు ట్రాన్స్‌జెండర్లు. అందుకే కొందరు ట్రాన్స్‌జెండర్లు తమకు నచ్చినవారితో కలిసి జీవితాన్ని ఆరంభించేందుకు సిద్దమయ్యారు. శనివారం రోజున ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో 15 ట్రాన్స్‌జెండర్‌ జంటలు వివాహ బంధంతో ఒకటయ్యాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలకు రాయ్‌పూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త విద్య రాజ్‌పుత్‌ ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ముందు రోజున మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు నిర్వహించారు.

వివాహ బంధంతో ఒకటైన 15 జంటల్లో ఛత్తీస్‌గఢ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. చాలా కాలంగా తమ బాధలను ఎవరు పట్టించుకోలేదని ఈ వేడుకల్లో పాల్గొన్న మధు కిన్నర్‌ తెలిపారు. కానీ ఈ రోజు తాము పెళ్లిలు చేసుకోవటానికి చక్కటి అవకాశం కల్పించిందని అన్నారు. తాము జీవిత భాగస్వామ్యులను పొందడం కంటే గొప్ప వార్త ఎముంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి అని.. భవిష్యత్తులో ఇలాంటివి మరెన్నో జరగడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. 

2014లో సుప్రీం కోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్‌ జెండర్‌గా పేర్కొంటూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారికి రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులూ వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి.

మరిన్ని వార్తలు