మాజీ పోలీసులకు జీవితఖైదు

1 Nov, 2018 03:46 IST|Sakshi

1987 నాటి  హషింపురా ఊచకోత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: హషింపురా ఊచకోత కేసులో 16 మంది మాజీ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని హషింపురాలో 1987లో 42 మంది మైనారిటీలను చంపినందుకు వారికి ఈ శిక్ష విధించింది. నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును  ధర్మాసనం కొట్టేసింది. 1987 మే 22న మీరట్‌లోని హషింపురా గ్రామానికి చెందిన 50 మంది ముస్లింలను పోలీసులు తీసుకెళ్లారని, ఆ తర్వాత వారిని చంపేసి కెనాల్‌ కాలువలో పడేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలో 42 మంది మైనారిటీలు చనిపోయారని తేలింది. ఈ ఘటనలో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ.. మృతుల కుటుంబాలు న్యాయం కోసం 31 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని, వారికి జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం సరిపోదని వ్యాఖ్యానించింది. నవంబర్‌ 22లోగా లొంగిపోవాల్సిందిగా దోషులను కోర్టు ఆదేశించింది. ఆ 16 మంది పోలీసులు రిటైర్‌ అయ్యారని, వారిపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మొత్తం 19 మంది పేర్లు చేర్చగా, 17 మందిపై చార్జి షీటు దాఖలైంది. అందులో ఒకరు కేసు విచారణలో ఉండగానే చనిపోయాడు. 

మరిన్ని వార్తలు