మెర్సిడెస్‌ స్పీడుకు ఇంటర్‌ విద్యార్థి బలి

6 Mar, 2017 10:25 IST|Sakshi
మెర్సిడెస్‌ స్పీడుకు ఇంటర్‌ విద్యార్థి బలి

న్యూఢిల్లీ: బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్‌ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. తాజాగా అక్కడ ఓ 17 ఏళ్ల ఇంటర్‌ కుర్రాడు మెర్సిడెస్ కారు స్పీడుకు బలైపోయాడు.

అతుల్‌ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్‌పై తన స్నేహితుడిని డ్రాప్‌ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమ్‌ విహార్‌ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫోటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్‌ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.