ఒడిశాలో బాలికపై రేప్.. సజీవ దహనం

3 May, 2014 04:38 IST|Sakshi

బరంపురం (ఒడిశా), న్యూస్‌లైన్: ఒడిశాలోని గంజాం జిల్లాలో రంబా గ్రామానికి చెందిన ఓ బాలిక పై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..రంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని డియాడైయి గ్రామంలో గురువారం రాత్రి ఓ వివాహం జరిగింది. దీనికి తపస్వినీ దాస్(17) అనే బాలిక హాజరైంది. రాత్రంతా బంధువులు, స్నేహితులతో కలసి పెళ్లిలో ఆనందంగా గడిపిన ఆమె వేకువజామున 4 గంటల ప్రాంతంలో బహిర్భూమికని బయటకు వెళ్లింది.
 
 ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు వెదికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తపస్విని పూర్తిగా కాలిన స్థితిలో విగతజీవిగా పడి ఉంది. ఆమె మృతదేహం పడివున్న స్థితిని, అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్టు అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆగ్రహించిన స్థానికులు రహదారిపైకి చేరి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రహాదారిని దిగ్బంధించి రాస్తారోకోకు దిగారు. ఇదిలావుండగా రేషన్ డీలర్‌గా పని చేస్తున్న తపస్వినీ దాస్ సోదరి ప్రణతి దాస్ సుమారు రెండు నెలల కిందట ఇదే రీతిలో హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలూ పథకం ప్రకారమే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు