బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత కల్బుర్గి దారుణ హత్యకు నిరసనగా సాహిత్య పురస్కారాలను తిరిగి ఇస్తున్న రచయితలలో మరో రచయిత్రి కూడా తోడయ్యారు. కర్ణాటకకు చెందిన రియా వితాషా(17) తన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. కల్బుర్గి కేసులో ఇంతవరకు నేరస్తులను గుర్తించకపోవడంతో పాటు, శిక్షించడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా తన అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
ముద్దు తీర్థహళ్లి అనే కలంపేరుతో ప్రసిద్దురాలైన రియా 'ఒందు చంద్రాణ తుందు' వ్యాస సంపుటికి 2011లో కర్ణాటక ప్రభుత్వ సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. ఆమె అయిదు నవలలు కూడా రచించారు. వీటిలో కథా హదియా హూగళు అనే నవల ఆధారంగా రూపొందిన సినిమా అవార్డును కూడా గెల్చుకుంది.
కల్బుర్గిని హత్యచేసిన వారిని ఇంతవరకు పట్టుకోలేక పోవడంపై రియా వితాషా ఆవేదనవ వ్యక్తం చేశారు. తనకు బాల్యం నుంచి తెలుసనీ, ఆయన రచనలన్నీ చదివానన్నారు. ఆయన హత్యకు గురైనపుడు చాలా వేదనకు గురయ్యాననీ, అపుడే తన అవార్డును వెనక్కి ఇవ్వాలనుకున్నానన్నారు. అయితే తన తల్లిదండ్రులు సహనం పాటించాలని చెప్పడంతో మౌనంగా ఉండిపోయానని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనా ఇది స్పందించాల్సిన సమయని ఆమె అన్నారు.
వితాషా తీసుకున్న నిర్ణయంపై ఆమె తల్లి లిడియా డి మెల్లో హర్షం వ్యక్తం చేశారు. కన్నడ రచయిత చంద్రశేఖర్ పాటిల్ తన అవార్డును వెనక్కి ఇచ్చేసిన వార్త విన్న తరువాత తన కూతురు ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కల్బుర్బి హత్య తరువాత నితాషా చాలా ఆవేదనకు గురైందని తెలిపారు. నిరసనగా ఏదైనా చేయాలని వితాషా ఎప్పటినుంచో ఆలోచిస్తోందన్నారు.
ఇప్పటివరు తమ అవార్డులు తిరిగి ఇచ్చిన వారిలో బహుశా అతి పిన్న వయస్కురాలైన రియా వితాషా పీయుసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.