శివమొగ్గలో బాలికపై గ్యాంగ్‌రేప్‌

24 Oct, 2016 19:55 IST|Sakshi
శివమొగ్గలో బాలికపై గ్యాంగ్‌రేప్‌

శివమొగ్గ (కర్ణాటక): బెంగళూరుకు చెందిన బాలిక (17)పై శివమొగ్గలో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో ఇద్దరు ఆటో డ్రైవర్లతో పాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు శివమొగ్గ ఎస్పీ అభివన్ ఖరే తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన బాలిక (17) కోలారులోని ఓ కళాశాలలో పీయూసీ చదువుతోంది. గత నెల ఏడున తల్లితో గొడవపడి రైలులో శివమొగ్గ చేరింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో రైలు దిగింది.

స్టేషన్ నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ షారూఖ్ వద్దకు వెళ్లి తాను ఇంటి నుంచి పారిపోయి వచ్చానని, రాత్రి ఉండటానికి ఆశ్రయం కల్పించాలని కోరింది. దీంతో అతను బాలికను ఆటోలో ఎక్కించుకున్నాడు. దారిలో మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు అంజాద్, తోషిక్‌లను తీసుకుని సక్రైబైలు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను అంజాద్ బావకు చెందిన ఇమామ్‌బాడ లేఔట్‌కు తీసుకెళ్లి బంధించారు. అప్పటి నుంచి అక్కడే ఉంచారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఈ నెల 20న బాలికను రక్షించారు. సక్రబైలు లేఔట్‌లోని ఒకటో క్రాస్‌కు చెందిన ఆటోడ్రైవర్ అంజాద్, యూసూఫ్, అతని భార్య భాను, వీరి బంధువు ముబారక్‌లను అరెస్ట్ చేశారు. షారూఖ్, తౌషిక్ పరారీలో ఉన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శివమొగ్గ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు