ముంబై : దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు కూడా కోవిడ్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు 1666 మంది పోలీసులకి కరోనా సోకగా, 18 మంది మరణించారు. ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ ఫడ్టారే వైరస్ ధాటికి మరణించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరం బిర్ సింగ్ తెలిపారు. వయసు పైబడిన కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన సెలవులో ఉండగా శుక్రవారం కన్నుమూసినట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు సంతాపం ప్రకటించారు. మే 21న కరోనా కారణంగా ఎఎస్ఐ భివ్సేన్ హరిభావును కోల్పోయామని, వరుసగా పోలీసులు వైరస్కు బలికావడం పట్ల రాష్ట్ర డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. (కరోనా విజృంభణ: ఉలిక్కిపడ్డ మహారాష్ట్ర )
Mumbai Police regrets to inform about the unfortunate demise of HC Arun Phadtare from Vile Parle PStn. Being in the high-risk age-group, HC Phadtare was on leave for the past few days.
We pray for his soul to rest in peace. Our thoughts and prayers are with the Phadtare family.
— Mumbai Police (@MumbaiPolice) May 22, 2020
ఇప్పటికే వయసు పైబడిన వారిని విధుల్లోకి రావొద్దంటూ పోలీస్ వర్గాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అధికసంఖ్యలో మహారాష్ర్టలో పోలీసులు మృత్యువాతపడుతుండటంతో సిబ్బంది కొరత కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాయుధ పోలీసు దళాల నుండి సుమారు 2000 మంది అదనపు పోలీసులను పంపమని కోంద్రాన్ని కోరింది. భారత్లోనే అత్యధికంగా మహారాష్ర్టలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ర్టంలో ఇప్పటివరకు 44,582 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక ప్రాణాంతక వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1517 కు పెరగగా, శుక్రవారం ఒక్కరోజే 63 మంది ప్రాణాలు కోల్పోయారు. (సడలింపులకు గ్రీన్ సిగ్నల్ )