అదృశ్యమైన ముంబై పేళుళ్ల సూత్రధారి అరెస్టు

17 Jan, 2020 20:08 IST|Sakshi

కాన్పూర్‌ : పెరోల్‌పై ఉండి కనిపించకుండా పోయినా జలీస్‌ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు శుక్రవారం కాన్పూర్‌లో అరెస్టు చేశారు.1993 ముంబై వరుస పేళుళ్ల కేసులో జలీస్‌ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. కాన్పూర్‌లోని మసీదు నుంచి ప్రార్థన అనంతరం బయటికి వస్తున్న జలీల్‌ అన్సారీ యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్సారీని లఖ్‌నవూ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 'డాక్టర్‌ బాంబ్‌'గా పేరు పొందిన 68 ఏళ్ల ముంబై పేళుళ్ల కేసులో అన్సారీ రాజస్తాన్‌లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే నెల ముందు అన్సారీకి 21 రోజుల పెరోల్‌ రావడంతో అతని స్వస్థలమైన మోమిన్‌పూర్‌కు వచ్చాడు.

కాగా జనవరి 17న అన్సారీ పెరోల్‌ పూర్తవడంతో ఉదయం 11 గంటల కల్లా జైలుకు రావాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబైలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కాన్పూర్‌లోని మసీదు నుంచి బయటకు వస్తున్న జలీస్‌ అన్సారీని అరెస్టు చేశారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అన్సారీ బాంబులు సరఫరా చేసినట్లు తేలడంతో సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన సిమి, ఇండియన్‌  మొజాహిద్దీన్‌ ఉగ్రవాదులకు బాంబులు ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చాడు. 1993 జరిగిన ముంబై వరుస పేళుళ్లలో 317 మంది చనిపోగా, వందల మంది గాయపడ్డారు.

మరిన్ని వార్తలు