దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!

5 Apr, 2016 09:52 IST|Sakshi
దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!

మాండ్యా: కర్ణాటకలో తాజాగా పరువు హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేశారు. బాధితురాలిని మోనికగా గుర్తించారు. కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి ఆమె పంటపొలాల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ వ్యవహారం పోలీసులకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆదివారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు.  

మోనిక కొన్నిరోజుల కిందట తనను ప్రేమించిన దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమెను భయపెట్టి ఆత్మహత్య లేఖ రాయించారని, ఆ తర్వాత బలవంతంగా ఆమెకు ఉరివేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రిని, అంకుల్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

గత నెలలో తమిళనాడులో పట్టపగలే శంకర్ అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణంగా చంపేసిన చంపేసిన సంగతి తెలిసిందే. దళిత యువకుడైన శంకర్ అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు అతికిరాతకంగా ఈ పరువు హత్యకు పాల్పడ్డారు.  
 

మరిన్ని వార్తలు