పణాజి: ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో పోలీసులమని చెప్పి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్న ముఠాల ఆగడాలు రోజుకు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఒంటరిగా ఉన్న యువతులు, టూరిస్ట్ మహిళలపై జరుగుతున్నఅత్యాచారాల నివారణకు ఓ నిఘా కొనసాగుతూండగానే సోమవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను.. పోలీసులమంటూ బెదిరించి కిడ్నాప్ చేసి అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డిన ఘటన కలకలం రేపింది. డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్ గోయంకర్ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీకి చెందిన 20-30 ఏళ్ల ఇద్దరు యువతులు గోవాలోని ప్రముఖ బీచ్ అంజునా బీచ్కు వెళ్లడానికి ఒక ప్రైవేట్ క్యాబ్లో బయల్దేరారు.
అయితే మార్గమధ్యలో మోటార్ సైకిళ్ళ మీద వచ్చిన అయిదుగురు యువకులు వీరిని అడ్డగించారు. మత్తు మందుల రవాణాను అడ్డుకునే పోలీసులమని, తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి నమ్మించి యువతులపై దాడికి దిగారు. యువతులతో పాటు, టాక్సీ డ్రైవర్ను దారుణంగా కొట్టి, వారి బ్యాగులను లాక్కున్నారు. ఆ తర్వాత యువతులను కిడ్నాప్ చేసి స్థానికంగా ఉన్న ఒక రిసార్ట్కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు రెండు రోజుల పాటు యువతులను చిత్రహింసలు పెట్టి వారిపై లైంగిక దాడి చేశారు.
కాగా టాక్సీ డ్రైవర్ ఫిర్యాదుతో అప్రమత్తం అయిన పోలీసులు.. బాధిత యువతులతో పాటు ఐదుగురి యువకులనూ అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులపై కేసు నమోదు చేశామని, రిసార్ట్ యజమాని పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని గోయంకర్ తెలిపారు. నిందితులను ముంబై, కర్ణాటక, హైదారాబాద్, రాజస్థాన్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.