20 మంది రైతుల మృతి

9 Oct, 2017 04:11 IST|Sakshi

ముంబై: పంట చేలకు పురుగు మందులు కొడుతుండగా వెలువడ్డ విష వాయువుల్ని పీల్చడంతో మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లాలో 20 మంది రైతులు, రైతు కూలీలు మృత్యువాత పడ్డారు. గత రెండు నెలల వ్యవధిలో  చోటుచేసుకున్న ఈ మరణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పురుగు మందుల ప్రభావంతో 700 మంది ఆస్పత్రి పాలయ్యారని, 25 మంది కంటి చూపు కోల్పోయారని జిల్లాకు చెందిన రైతు నాయకుడు దేవేంద్ర పవార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మోతాదుకు మించి పురుగుమందుల వాడకంతోనే ఈ మరణాలు సంభవించాయన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో క్షేత్ర స్థాయిలో విచారణ చేయించామని, మెరుగైన వైద్యం అందని బాధిత రైతుల్ని నాగ్‌పూర్‌కు తరలించామని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ ఫండ్కర్‌ చెప్పారు.   

>
మరిన్ని వార్తలు