మూడ్రోజుల్లో 20 మంది శిశువులు మృతి

30 Oct, 2017 02:59 IST|Sakshi

అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రిలో దారుణం

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో శనివారం ఒక్కరోజే 9 మంది శిశువులు మృతి చెందారు. దీంతో గత మూడు రోజుల్లో ఇక్కడ మృత్యువాత పడిన చిన్నారుల సంఖ్య 20కి పెరిగింది. శనివారం చనిపోయిన 9 మందిలో ఐదుగురిని వేరే ఆసుపత్రుల నుంచి వైద్యం కోసం ఇక్కడికి తరలించగా, మిగిలిన నలుగురు ఇదే ఆసుపత్రిలో జన్మించారు. వీరంతా ఐసీయూలో ఉండగానే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే శిశు మరణాలు సంభవించాయన్న వార్తలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎంఎం ప్రభాకర్‌ కొట్టిపారేశారు. 24 గంటలూ వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. చనిపోయిన పిల్లల బంధువులు, కుటుంబీకులు దాడులకు పాల్పడొచ్చన్న అనుమానాలతో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శిశు మరణాలకు బాధ్యత వహిస్తూ గుజరాత్‌ సీఎం రూపానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరింది. 

మరిన్ని వార్తలు