కొండచివరెక్కి.. సెల్ఫీలకి పోజులిచ్చి..

6 Feb, 2017 10:55 IST|Sakshi
కొండచివరెక్కి.. సెల్ఫీలకి పోజులిచ్చి..

డెహ్రాడూన్‌: ప్రతిరోజు సెల్ఫీల మరణాలు చూస్తున్నా యువత తీరు మాత్రం మారడం లేదు. ఏది ప్రమాదమో.. ఏది కాదో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే కోల్పోతున్నారు. డెహ్రాడూన్‌లో మన్‌దీప్‌, మునీర్‌ అహ్మద్‌ అనే ఇద్దరు స్నేహితులు. వారు ఒక రోజంతా టూర్‌కోసం ముస్సోరి బయలుదేరి సరదాగా గడిపారు. అక్కడ పడితే అక్కడ ఫొటోలు దిగారు. తిరిగి వచ్చే క్రమంలో ఒక కొండను చూసి అక్కడి నుంచి స్వీయ చిత్రాలు తీసుకోవాలనిపించింది.

దీంతో ఆ ఇద్దరు తమ బైక్‌లు పార్కింగ్‌ చేసి కోలుకేట్‌ అనే గ్రామంవద్ద దాదాపు 50 అడుగుల ఎత్తున్న కొండ ఎక్కారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలు రావాలని వెనక్కి జరిగి సెల్ఫీ తీసుకుంటుండగా మునీర్‌ అహ్మద్‌ అంతెత్తుమీద నుంచి కిందపడ్డాడు. తోటి స్నేహితుడు సహాయం కోసం అక్కడే ఉన్న గ్రామస్తులను తీసుకొచ్చినా అతడి స్నేహితుడు ప్రాణాలుకోల్పోయాడు.

ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తలకు బలమైన గాయాలయిన కారణంగానే మునీర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో మునీర్‌ బీకామ్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఇప్పటికే సెల్ఫీ మరణాల్లో డెహ్రాడూన్‌ తొలి స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు