ఆ జైలులో 23 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ..!

28 Feb, 2018 13:13 IST|Sakshi

గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు బయట పడింది. గత కొన్ని నెలలుగా వైద్యులు జిల్లా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహించామని జైలు అధికారలు తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందన్నారు.

వారంతా ప్రస్తుతం బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. హెచ్‌ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని.. అసలు హెచ్ఐవీ సోకడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో పాటు జిల్లా జైలులో ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని వెల్లడైనట్టు తెలిపారు. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇటీవలే ఉన్నావో జిల్లా, బంగార్‌మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మందికి హెచ్‌ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు