సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో క్షయ(టీబీ) వ్యాధి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 24.04 లక్షల మంది టీబీ బారిన పడ్డారు. 2018తో పోలిస్తే ఇది 14శాతం మేర పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో క్షయ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ టీబీ రిపోర్టు–2020’ బుధవారం విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2025 నాటికి టీబీ రహిత దేశమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు
క్షయ నివారణలో ఏపీకి రెండో స్థానం
టీబీ నివారణ పోగ్రాంలో 2019 ఏడాదికి గాను దేశంలో ఆంధ్రప్రదేశ్కు రెండో స్థానం దక్కింది. 50 లక్షలకు పైబడిన రాష్ట్రాల కేటగిరిలో ఏపీకి ప్రశంస పత్రం అందింది. జాతీయ క్షయ నిర్మూలన విభాగం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదబ్బులో ‘ఇండియా టీబీ రిపోర్ట్ 2020’ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 2019 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు మంత్రి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్షయ నిర్మూలకు తీవ్రంగా కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. కాగా, టీబీ నివారణ పోగ్రాంలో గుజరాత్ మొదటి స్థానం, ఏపీ రెండో స్థానంలో నిలవగా, హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానం దక్కించుకుంది.