విలవిల్లాడుతున్న కేరళ

17 Aug, 2018 18:02 IST|Sakshi

ప్రకృతి బీభత్సానికి కేరళ విలవిల

324మంది  మృతి

విద్యుత్‌ కోతతో  80శాతం రాష్ట్రం చీకట్లో

14జిల్లాల్లో  కొనసాగుతున్న రెడ్‌ అలర్ట్‌

 పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

 ఆగస్టు 26వరకు కొచ్చి విమానాశ్రయ  సేవలు రద్దు

తిరువనంతపురం: కేరళను ప్రకృతి బీభత్సం మరింత కుదిపేస్తోంది. అనేక జిల్లాల్లో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. భారీ వర్షాలు, వరదల్లో గత మే నెల నుంచి  ఇప్పటివరకూ 324మంది చనిపోయారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. దాదాపు రెండు లక్షలమందిని  సహాయక శిబరాలకు తరలించినట్టు తెలిపారు. కేరళకు  విరివిగావిరాళాలివ్వాల్సిందిగా  మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన లింక్‌ను  సీఎంఓ కేరళ ట్విటర్‌ లో  పోస్ట్‌ చేసింది. కేరళకు మద్దతు ఇవ్వండంటూ ఒక ఆన్‌లైన్‌ డొనేషన్‌   క్యాంపెయిన్‌ ప్రారంభించింది.

14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.  రాష్ట్రంలో పలుచోట్ల  విద్యుత్‌ లేక అల్లాడిపోతున్నారు.  కేరళ విద్యుత్‌ బోర్డు పవర్‌కట్‌ చేయడంతో దాదాపు 80శాతం రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది.  కొబ్బరి, కాఫీ,  నల్ల మిరియాలు లాంటి ఇతర ముఖ్య పంటల ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింది. వరదలు, కొండచరియలు కారణంగా కొజీకోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, పతనమిత్తిట్ట, ఇడుక్కి జిల్లాల్లో రోడ్లు,  రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి దారి మళ్లించారు.  అలాగే  ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను  రద్దు చేశారు.14 జిల్లాల్లో సుమారు 2లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 32,500పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకటించింది.  కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీని సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు కేరళలోని వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం  అక్కడ పర్యటించనున్నారని తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు