మరో 250 మంది భారతీయులకు కరోనా

17 Mar, 2020 19:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనావైరస్‌ (కోవిడ్‌-19) ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో చిక్కుకున్న 250 మంది భారతీయులకు కరోనా సోకినట్లు ప్రకటించింది. మంగళవారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 137 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇరాన్‌లో చిక్కుకున్న 250 మంది భారతీయులకి కరోనా పాజిటివ్‌ అని తేలిందని ప్రకటించింది. విదేశాలలోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 72 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఆప్ఘనిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాల నుంచి భారత్‌కు ప్రయాణీకుల రాకను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూర్తిగా నిషేధించింది. ఈనెల 31 వరకూ ఇది అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని  పేర్కొంది. కాగా ఐరోపా దేశాలు, టర్కీ, బ్రిటన్‌ ప్రయాణీకులపై కూడా భారత్‌ ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే
(చదవండి : తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు)

కాగా, కరోనా విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఏప్రిల్‌ 2వ తేది వరకు విద్యాసంస్థలకు బంద్‌ ప్రకటించాయి. సినిమా థియేటర్లు, మాల్స్‌, జిమ్‌ సెంటర్లు మూసేశాయి. మంగళవారం సాయంత్రానికి దేశ వ్యాప్తంగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఐదు కరోనా కేసులు నమోదు కాగా, ఏపీలో ఒకరికి కరోనా వైరస్‌ సోకింది.  ఇక  ప్రపంచవ్యాప్తంగా 142 దేశాలకు పాకిన కరోనా... 7000 మంది ప్రాణాలను బలిగొంది. 1,70,000 మందికి కరోనా సోకింది. 
(చదవండి : భారత్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు!)

మరిన్ని వార్తలు