సబ్సిడీల్లో 3% పెంపు

2 Feb, 2017 04:37 IST|Sakshi

పెరిగిన ఆహారం.. తగ్గిన పెట్రోలియం ∙ఎరువుల సబ్సిడీలో మార్పులేదు  

న్యూఢిల్లీ: 2017–18 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ అంచనా రూ. 2,40,338 కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే 3% పెరుగుదల కనిపించింది. ఇందులో ఆహార సబ్సిడీ రూ.1,45,338 కోట్లు. నవంబర్‌ 2016 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రత చట్టం అమలవుతుండటంతో (80 కోట్ల మందికి పైగా ఆహార సబ్సిడీ అందుతోంది) ఈ అంచనా పెరగొచ్చు. కాగా, ఎరువుల సబ్సిడీలో ఏ మార్పూ లేదు. గత బడ్జెట్‌ మాదిరిగానే ఈసారీ రూ.70 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వనుంది. ఇందులో రూ.49,768 కోట్లు యూరియాకు, రూ.20,232 కోట్లు ఫాస్పారిక్, పొటాసిక్‌ ఎరువులకు ఇవ్వనున్నారు. అయితే పెట్రోలియం సబ్సిడీని తగ్గించారు. గతేడాది రూ. 27,531.71 కోట్ల సబ్సిడీ ఉండగా.. ఈ ఏడాది దీన్ని రూ. 25వేల కోట్లకు తగ్గించారు. ఇందులో ఎల్పీజీకి రూ.16,076.13 కోట్లు, మిగిలింది కిరోసిన్‌కు వర్తిస్తుంది.

చక్కెరపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం
చక్కెరపై సబ్సిడీలకు కేంద్రం చెల్లుచీటి రాసింది. కిలోపై ఇప్పటిదాకా రాష్ట్రాలకు ఇస్తున్న రూ. 18.50  సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్పరం నుంచి ఉండదు. జైట్లీ బుధవారం బడ్జెట్‌లో చక్కెర సబ్సిడీల బకాయిల చెల్లింపు నిమిత్తం రూ. 200 కోట్లే ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయింపులేమీ చేయలేదు. దేశవ్యాప్తంగా రేషన్‌ షాపుల ద్వారా ఏటా 27 లక్షల టన్నుల చక్కెరను 40 కోట్ల బీపీఎల్‌ కుటుంబాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేసే చక్కెరను ఓపెన్‌ మార్కెట్లో రాష్ట్రాలు సేకరిస్తున్నాయి. ఇలా సేకరించే చక్కెరపై కేంద్రం కిలోకు రూ.18.50 సబ్సిడీ ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్ల కార్డులపై ఒక్కో కుటుంబానికి అరకేజి చక్కెరను సబ్సిడీపై అందిస్తున్నారు. ఈసారి కేటాయింపులు లేవు కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రాలే ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.

అధికారుల శిక్షణకు 180 కోట్లు
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌ కేటాయింపుల్లో సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 180 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని అధికారులకు శిక్షణనిచ్చేందుకు వినియోగి స్తారు. ఇందులో రూ.60.61 కోట్లు ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌కు, ముస్సోరీలోని లాల్‌బహదూర్‌ నేషనల్‌ అకా డమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)లలో నిర్మాణ ఖర్చులకు వినియో గించనున్నారు. మిగిలిన రూ.119.37 కోట్లు ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏలో అధికారుల శిక్షణ తదితరాలకు కేటాయించారు. గతేడాది ఇందుకోసం 179.17 కోట్లను కేటాయించారు. కేంద్రీయ సమాచార కమిషన్‌ (సీఐసీ), పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ)లకోసం రూ.25.42 కోట్లు కేటాయిం చారు. గతేడాది ఈ కేటాయింపులు రూ. 28 కోట్లు. దీనికి తోడు సీఐసీకి నూతన భవన నిర్మాణానికి రూ.25.47 కోట్లు, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)కు రూ.105.81 కోట్లు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ)కు రూ. 197.32 కోట్ల కేటాయింపులు జరిగాయి.

మరిన్ని వార్తలు