వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లి ముగ్గురు విద్యార్థినులు మృతి

13 Oct, 2016 19:55 IST|Sakshi

చెన్నై: కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులపై వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు విద్యార్థినులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థినులతోపాటు ఓ మోటారు సైకిలిస్టు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చెన్నైలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే చెన్నై గిండి - సైదాపేట మార్గంలోని తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు కూత వేటు దూరంలో చెల్లమ్మాల్ డిగ్రీ కళాశాల ఉంది. ఈ కళాశాల విద్యార్థినులు పలువురు గిండి నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వైపుగా కళాశాలకు సమీపంలో వెళ్తుండగా, వాటార్ ట్యాంకర్ రూపంలో ముగ్గుర్ని మృత్యువు కబళించింది.

అతి వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ ముందుగా ఓ మోటారు సైకిల్‌ను, మరో ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి విద్యార్థినుల మీదుగా లారీ దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో చిత్ర, గాయత్రి, ఆషా అనే ముగ్గురు విద్యార్థినులు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ జయశ్రీ అనే విద్యార్థిని, మోటారు సైకిలిస్టు శివరాజ్‌తో పాటు మరొకర్ని చికిత్స నిమిత్తం రాయపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ రాజేంద్రన్ పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు