కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

3 May, 2019 20:30 IST|Sakshi

శ్రీనగర్‌: ఉగ్రవాదుల ఏరివేతలో జమ్మూకశ్మీర్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. శుక్రవారం జరిపిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ సన్నిహితుడైన లతీఫ్‌ దార్‌ అలియాస్‌ లతీఫ్‌ టైగర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఘటన షోఫియాన్‌ జిల్లా ఇమాన్‌ సాహిబ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ‘భద్రతా దళాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండంగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులున్నారన్న అనుమానం బలపడింది. వారు తప్పించుకోకుండా కాల్పులు జరిపాం’ అని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మృతి చెందిన లతీఫ్‌ టైగర్‌ 2014లో ఉగ్రవాద సంస్థలో చేరగా, అతన్ని అరెస్టు చేశారని ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్నట్లు తెలిపారు.

లతీఫ్‌ టైగర్‌ బెయిల్‌ గడువు పూర్తయిన తర్వాత జిల్లా జడ్జి ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల్లో చేరాడని చెప్పారు. అలాగే లతీఫ్‌ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడని, దక్షిణ కశ్మీర్‌లోని సర్పంచులను చంపిన కేసుల్లోనూ అతని హస్తముందని అన్నారు. ‘చివరగా మిగిలి ఉన్న ఉగ్రవాదుల్లో లతీఫ్‌ ఒకడు. లతీఫ్‌ మృతితో రియాజ్‌ నైకూ, జకీర్‌ మూసా వంటి ఉగ్రవాదులు మాత్రమే మిగిలి ఉన్నారు’ అని చెప్పారు. లతీఫ్‌ బుర్హాన్‌ వనీతో కలిసి ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ పోస్టర్‌ బాయ్‌గా పనిచేశాడు. 2016 జూలైలో బుర్హాన్‌ మృతితో లతీఫ్‌ రియాజ్‌ నైకూ సహాయకుడిగా ఉన్నాడు.

మరిన్ని వార్తలు