30 గంటలు పట్టింది!

13 Apr, 2015 03:17 IST|Sakshi
జవాన్ల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రమణ్ సింగ్

 రాయ్పూర్/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల మృత దేహాల తరలింపునకు 30 గంటల సమయం పట్టింది. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరగ్గా, ఆదివారం సాయంత్రానికి మతదేహాలను కాంకేర్‌లంక పోలీసు క్యాంపునకు తరలించారు. మతదేహాలను ఘటనాస్థలి నుంచి హెలికాప్టర్లలో తరలించేందుకు ప్రయత్నించారు. వాతావరణం సహకరించకపోవడం, మృత దేహాల కోసం వెళ్లిన పోలీసులపై నక్సల్స్ మళ్లీ దాడి చేయవచ్చనే అనుమానంతో ప్రయత్నాల్ని విరమించుకున్నారు.

ఈ నేపథ్యంలో కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఎఫ్(జిల్లా ఫోర్‌‌స) పోలీసులు ఆదివారం భారీ ఎత్తున కాలినడకన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను క్యాంపుకు, తర్వాత అక్కణ్ణుంచి జగ్దల్‌పూర్ తరలించారు. మావోయిస్టుల దాడి మృతులకు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, పోలీసు ఉన్నతాధికారులు జగ్దల్‌పూర్‌లో నివాళులర్పించారు.

 అల్పాహారం తీసుకునేందుకు సిద్ధమవుతున్నపుడు నాలుగువైపుల నుంచి మావోలు దాడికి తెగబడ్డారిన జగ్దల్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు తెలిపారు. దాడి నుంచి తేరుకుని కాల్పులు ప్రారంభించేసరికే ఏడుగురు సహచరులను కోల్పోయామన్నారు. గ్రామం దగ్గర్లో దాడి చేయడంతో మావోలను తాము పసిగట్టలేదని, చాలామంది గ్రామీణుల వేషధారణలో ఉన్నారని వారు తెలిపారు.  శనివారం మధ్యాహ్నం  ఛత్తీస్గఢ్ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) జవాన్లను  దాదాపు 200 మంది నకల్స్ చుట్టుముట్టారు. ఇది గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. అటు మావోయిస్టులు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటపాటు ఆ ప్రాంతమంతా తుపాకుల చప్పుళ్లతో మారుమోగింది.ఈ ఘటనలో ఎ ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు మరణించారు. 11 మంది గాయాలతో బయటపడ్డారు.

మృతదేహాల కోసం బలగాలు
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని దోర్నపాల్- చింతగుఫా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ల మృతదేహాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనపర్చుకోవడానికి ఆలస్యానికి గల  కారణాలను ఏడీజీపీ ఆర్ కే విజ్ మీడియాకు వివరించారు. చనిపోయిన జవాన్ల శవాల కోసం ఘటనా స్థలానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బృందంపై అనూహ్యరితీలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో  భద్రతా దళం వెనక్కి వచ్చేసింది. ఆదివారం ఉదయం మరింత బలగంతో వెళితేగానీ శవాల స్వాధీనం సాధ్యపడలేదని విజ్ చెప్పారు.

మైనింగ్ కంపెనీపై దాడి
  సుక్మా జిల్లాలో ఏడుగురు జవాన్లను హతమార్చిన 24 నాలుగు గంటలలోపే కాంకేర్ జిల్లాలోని ఓ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీపై  మావోయిస్టులు దాడిచేసి 17 వాహనాలను తగలబెట్టారు. కోరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దాస్పూర్ ఐరన్ ఓర్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన సాయుధ నక్సలైట్లు కూలీలను వెళ్లగొట్టి మైనింగ్ యంత్రాలు, జేసీబీలు, జీపులు ఇతరత్రా మొత్తం 17 వాహనాలకు నిప్పుపెట్టారని కాంకేర్ ఎస్పీ జితేంద్రసింగ్ మీనా తెలిపారు. ఘటన అనంతరం మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సీ చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు